మహిళా ఉద్యోగి చేతివాటం..
రూ.33 లక్షల గోల్మాల్
వార్తాలోకం ప్రతినిధి- కడప
కడప జిల్లాలోని వల్లూరు వెలుగు కార్యాలయంలో నిధుల గోల్మాల్ స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ గోల్మాల్ కు ఓ మహిళా ఉద్యోగి శ్రీకారం చుట్టినట్లుగా సమాచారం. అయితే, ఆ మహిళా ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి సుమారు 33 లక్షల రూపాయల నిధులను స్వాహా చేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. వెలుగు ఆఫీస్ లో కమ్యూనిటీ కో- ఆర్డినేటర్గా పని చేస్తున్న సదరు మహిళా ఉద్యోగిని 2015 నుంచి 2023 ఏప్రిల్ వరకు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
వెలుగు కార్యాలయంలో పలువురు యానిమేటర్లు మాట్లాడుతూ వసూలు చేసిన సామాజిక పెట్టుబడి నిధులను మండల సమాఖ్య ఖాతాలో జమ చేయకుండా తమ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసి తమతోనే బ్యాంకు నుంచి నగదు తెప్పించుకుని మోసం చేసినట్లు వాపోయారు. తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఎందుకని ప్రశ్నించగా, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్యల మధ్య లావాదేవీలని చెప్పేవారని చెప్పారు. ఈ విషయమై ఏపీఎం శైలజను వివరణ కోరగా, ఆడిట్ ఇంకా పూర్తవ్వలేదని, త్వరలోనే పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు. నిధుల గోల్మాల్ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.