• తల్లిదండ్రులైన రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు

  • ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న‌

  • మెగా ఫ్యామిలీలో ప్రారంభ‌మైన మూడోత‌రం

  • 11 ఏళ్ల త‌ర్వాత సంబ‌రాలు

  • పండుగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్‌

ప్రముఖ సినీహీరో రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వ‌ర్గాలు ఒక‌ ప్రకటన విడుదల చేశాయి.

(వార్తాలోకం ప్ర‌తినిధి-హైద‌రాబాద్‌)
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నక‌ల సాకార‌మైంది. ఎట్ట‌కేల‌కు మెగా ఫ్యామిలీలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. సినీ దిగ్గ‌జం మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీలో మూడో తరం అడుగు పెట్టింది. హీరో రామ్‌ చరణ్ – ఉపాసన దంపతులు పేరెంట్స్ అయ్యారు. ఈరోజు (ఈ నెల 20న‌) జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. చరణ్‌- ఉపాసనలకు 2012లో వివాహమైంది. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు.

అయితే, ప్రస్తుతం తాను, చరణ్‌.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బేబీ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్‌ కీలక పాత్ర పోషించారని, గ్రాండ్ పేరెంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదని ఆమె చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది.  చిరంజీవి కుటుంబంలోకి వారసురాలు రావ‌డంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. దీంతో మెగా అభిమానులు సైతం పండ‌గ జ‌రుపుకుంటున్నారు. మెగా వారసురాలు వచ్చిందని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.