అదరగొట్టారు.. టీమిండియా స్కోర్ 317/5

0
787

ఇంగ్లాండ్‌ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ మంచి స్కోర్ చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాంగ్ జట్టును భారత బ్యాట్స్‌మెన్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేశారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో బెన్ స్టోక్స్ 3 వికెట్లు, మార్క్ వుడ్ రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత ఇన్నింగ్స్ సాగిందిలా..
తొలుత ఓపెనింగ్ వచ్చిన రోహిత్ శర్మ కాసేపు సేపు క్రీజులో ఉన్నా.. 42 బంతులను ఎదుర్కొని కేవలం 28 పరుగులు చేశాడు. కానీ, 16వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ వేసిన బంతిని ఆడబోయి.. కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 64 పరుగులకు భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌కు కెప్టెన్ కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఇదే సమయంలో శిఖర్ కూడా బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు ఆమాంతం దూసుకెళ్లింది. కానీ, 33వ ఓవర్‌లో మార్క్ వుడ్ వేసిన బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ.. మొయిన్ అలీ‌కి క్యాచ్ ఇచ్చి వికెట్ వదులుకున్నాడు. రెండో వికెట్ కోల్పోయే సరికి టీమిండియా స్కోర్ 169గా ఉంది. కోహ్లీ వికెట్ తర్వాత మిడిలార్డర్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ (6) విఫలమయ్యాడు. 187 పరుగుల వద్ద మార్క్ వుడ్ వేసిన 35వ ఓవర్‌లో పెవిలియన్ చేరాడు.

గబ్బర్ సూపర్ ఇన్నింగ్స్..
98 పరుగులతో సెంచరీ వైపు దూసుకెళ్తున్న శిఖర్ ధావన్‌.. బెన్ స్టోక్ వేసిన బంతిని ఆడబోయి.. మోర్గాన్‌ క్యాచ్ ఇచ్చాడు. దీంతో 197 పరుగుల వద్ద గబ్బర్ కూడా మైదానం వీడాడు. మొత్తం 106 బంతులు ఆడిన శిఖర్ 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ వికెట్ అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కాస్త ఒత్తిడికి గురై 1 పరుగు మాత్రమే చేసి.. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా 40.3 ఓవర్లకు 205 పరుగులు చేసి 5 వికెట్లు నష్టపోయింది.

రాహుల్-కృనాల్ మెరుపు ఇన్నింగ్స్..
సరిగ్గా ఇదే సమయంలో క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్-తొలి సారి వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా అదరగొట్టారు. వరుస బౌండరీలతో టీ-20 మ్యాచ్‌ను గుర్తు చేశారు. ముఖ్యంగా కృనాల్ బౌండరీల వర్షం కురిపించాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్షర్లతో 62 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేయగలిగారు. ఇక 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగే ఇంగ్లాండ్ ఏ మాత్రం స్కోరు చేస్తుందో వేచి చూడాల్సిందే.