మ‌హానాయ‌కుడు వైఎస్ ఆర్ 14వ వ‌ర్థంతి

ysr rajasekhar reddy, #ysr #ys jagan #apcm jagan # ys sharmila

0
408

జ‌నం కోసం పుట్టిన నేత‌. జన హితం కోరే మ‌హా నేత. జ‌న‌మే జీవితంగా బ‌తికిన నేత‌. జ‌నం కోస‌మే శ్ర‌మించి జ‌నం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన నేత‌. ఆయ‌నే వైఎస్‌ రాజశేఖర రెడ్డి. జనం గుండెల‌పై ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన మ‌హానాయకుడు వైఎస్ఆర్‌. రాజన్నగా ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటున్నారు.. ఆయన అంటే ఒక ఆత్మీయ పలకరింపు.. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శోకంలో ముంచుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయిన రోజు. ఆయ‌న స్వ‌ర్గ‌స్తులై నేటికి 14 ఏళ్ళు (సెప్టెంబర్ 2) ఆయన వర్ధంతి. ఆ మహానేతను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ మ‌రిచిపోరు.మ‌రిచిపోలేరు.. అది ఆయ‌న‌కు తెలుగు ప్ర‌జ‌లు ఇచ్చే భ‌క్తి పూర్వ‌క గౌర‌వం.

జనం కష్టసుఖాలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజలు, రైతుల కష్టాలు చూసి చలించిపోయారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఎంతో నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కల అనుకుంటే.. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి వారి కలను నిజం చేశారు. ఉన్నత చదువులు కొనలేమని భావించిన సరస్వతీ పుత్రులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వరం కల్పించిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకులకు పింఛను ఇచ్చి వారి ఆకలి తీర్చారు. తినే అన్నం మెతుకుల్లో, ఆయన కట్టించిన ఇందిరమ్మ ఇళ్లలోనూ, తమకు పునర్జన్మ ప్రసాదించిన రాజశేఖరుడిని తలుచుకుని 14 ఏళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ ఆయ‌న గుర్తుకుంటూ నేటికీ కన్నీళ్లు పెడుతుంటే అది అతిశయోక్తి కాదు. ఆ మ‌హ‌నీయుడు చేసిన ప్ర‌జాసేవ‌, చేప‌ట్టిన జ‌న‌రంజ‌క సంక్షేమ‌ప‌థ‌కాలు, జ‌నం కోసం ఆహ‌ర్నిశ‌లు శ్ర‌మించే త‌త్వ‌మే ఆయ‌న‌కు ఆ కీర్తి వ‌చ్చేలా చేసింది.

యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి అలియాస్ వైఎస్ఆర్ ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి, అంతేకాదు..కాంగ్రెస్ రాష్ట్ర పార్టీలో ఎదురులేని, తిరుగులేని నేత‌. మ‌హా నాయ‌కుడు. అంత‌కుమించి జ‌న హృద‌య నేత‌. జ‌నం భాష‌లో చెప్పాలంటే వ‌న్ అండ్ ఓన్లీ ది లీడ‌ర్‌..

1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం ఆరుసార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, నాలుగు సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రి పదవిని ఆలంక‌రించారు. ఆ త‌ర్వాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించారు. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు ఎలాంటి ప్రభుత్వ పదవి దక్కలేదు.

1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించారు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ, నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్రమంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. లక్ష కోట్ల రూపాయ‌లు అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలువేయగా, అప్పటి మంత్రి పి.శంక‌ర్‌రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్సార్ కాలంలో అవినీతి జరిగిందని సీబీఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. “క్విడ్ ప్రో కో ” రూపంలో వై.ఎస్‌. జగన్ కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సీబీఐ చార్జిషీటులో పేర్కొంది.

బాల్యం, విద్యాభ్యాసం
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల తిరుపతి నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే, అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

త‌ర్వాత కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ త‌ర్వాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.

వైఎస్ఆర్ రాజకీయ జీవితం
కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించారు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేత గా, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది.

1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగారు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహ‌మాట‌ ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధులు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి రెండు సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు, రెండో పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11 వ శాసనసభలో ప్రతిపక్షనేతగానూ వ్యవహరించారు.

2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.

ఏపీ ముఖ్యమంత్రిగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి..
2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయ‌జ్ఞాల‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.

2009 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించిపెట్టారు. అదేసమయంలో లోక్‌సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్స్‌ సంపాదించిపెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు.

వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ కూడా న‌డుపుతున్నారు. కూతురు షర్మిళ. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబుదాడిలో మరణించారు. గుల్బార్గాలో వైద్యవిద్య చదువుతున్నప్పటి నుంచీ ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కె.వి.పి. రామచంద్రరావు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాక ఆయన్ను సలహాదారుగా నియమించుకున్నారు.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటీషు మిషనరీల ప్రభావంతో క్రైస్తవమతం పుచ్చుకున్నార‌ని, తండ్రి రాజారెడ్డి మిలటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా, అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నార‌ని రెండు వేర్వేరు కథనాలు ఉన్నాయి. ఈయన కుటుంబం పులివెందుల‌లోని సి.ఎస్.ఐ చర్చికి హాజరౌతుంది. రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లోనూ, మరలా 2009లోనూ కుటుంబసమేతంగా బెత్లహాము యాత్రకు వెళ్ళివచ్చారు. క్రైస్తవులైనా పారంపరికంగా వచ్చిన హిందూ సంప్రదాయాలని వీడలేదు. రాజశేఖరరెడ్డి తిరుమలను అనేకమార్లు సందర్శించి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని పూజలు చేశారు. అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మతమార్పిళ్ళను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన్ను విమర్శించారు. ఈయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మీలాను పెళ్ళి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మతప్రచారకుడయ్యారు. ఈయన ప్రాభవం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్టైంది.

హెలికాప్టర్ ప్రమాదం ఘ‌ట‌న‌లో వైఎస్ఆర్ మ‌ర‌ణం
సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా, ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరు‌తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా, 25 గంటల త‌ర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్ళు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ ప్రియ‌త‌మ‌ నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 మంది చ‌నిపోయారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా, కొద్ది మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాదస్థలమైన పావురాల‌గుట్ట‌ రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు – వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలం మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.

తెలుగు ప్ర‌జ‌ల అభిమాన నాయ‌కుడిని, జ‌న‌హృద‌య నేత వైఎస్ఆర్‌ని త‌న ఒడిలో చేర్చుకున్న న‌ల్ల‌మ‌ల అడ‌వి, అదే గాంభీరంతో ఇంకా అడ‌విలాగే అల‌రారుతోంది. ఈ ప్ర‌మాదం జ‌రిగి 14 ఏళ్లు గ‌డిచిన‌ప్ప‌టికీ, జ‌నం కోసం ప‌రిత‌పించిన జ‌న‌నాయ‌కుడు, జ‌నం గుండెల‌పై చెర‌గ‌ని ముద్ర వేసిన వైఎస్ఆర్‌, భౌతికంగా ఈ జ‌నానికి దూర‌మైనా ఈ భూమి, ఆకాశం ఉన్నంత‌కాలం జ‌నం గుండెల్లో ఉంటాడు. ఆయ‌న గ‌మ‌నం ఆగ‌మ‌నం గ‌మ్మం జ‌న‌మే. జ‌న హృద‌య‌నేత జ‌యుడే.. మృత్యుంజయుడే.. అమ‌రుడే..

వ్యాస‌క‌ర్త‌- వాకిటి వెంక‌టేశం, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌