యాప్ లో హాజరుపడితేనే జీతాలు..!
సర్కార్ బడులు, ఆఫీస్ల డిజిటలైజేషన్
వేగంగా మార్పులకు ఏపీ సర్కార్ శ్రీకారం
ఏపీని డిజిటల్గా మారుస్తున్న సీఎం జగన్
పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇలా అన్నిచోట్ల ప్రజలకు అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సును పక్కాగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సు పక్కాగావేస్తే తప్పా నెలాఖరుకి జీతబత్యాలు వచ్చే పరిస్థితితి లేదని తేల్చి చెప్పింది. అందుకోసం సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది.
ఈ విషయంలో ఏ ఒక్కప్రభుత్వశాఖకు వెసులుబాటు లేదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయంలో అధికారులతోపాటు, ఉద్యోగులూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్యాలయాల పనివేళల్లో ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వారి పనులు సత్వరమే చేస్తారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖల్లో తొలిసారిగా తీన్ మార్ బయోమెట్రిక్ ను గ్రామ, వార్డు సచివాలయశాఖలో అమలు చేశారు. ఇక్కడ ఉద్యోగులు రోజులో మూడు సార్లు బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. మొత్తం 19శాఖలకు చెందిన సిబ్బందిలో అత్యవసర పని ఉన్నప్పుడు తప్పా బయటకు వెళ్లే వీలులేకుండా ఏర్పాట్లను పక్కాగా అమలు చేస్తోంది. నెలలో హాజరు లో తేడాలు, తక్కువ వస్తే సదరు ప్రభుత్వశాఖ జిల్లా, డివిజన్, మండల శాఖ అధికారుల నుంచి డ్యూటీ సర్టిఫికేట్ తెస్తే తప్పా జీతాల బిల్లులు కూడా సచివాలయాల్లో పెట్టడం లేదు.
దీనితో రోజులో మూడు సార్లు బయోమెట్రిక్ వేసే తొలి ప్రభుత్వ శాఖగా గ్రామ,వార్డు సచివాలయశాఖ తొలిస్థానంలో ఉంది. చాలా చోట్ల పాత పంచాయతీ కార్యదర్శిలు, కొందరు సచివాలయ కార్యదర్శిలు బయో మెట్రిక్ హాజరు విషయంలో తేడాలు చేస్తున్నవారిని కూడా ప్రభుత్వం గుర్తించి ఒక్కొక్కరినీ ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా తెరలేపింది.
ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తో కష్టాలు
విద్యాశాఖలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తోపాటు, పిల్లల హాజరుని కూడా ఇకపై ఉపాధ్యాయులు ఆన్ లైన్ లో చేపట్టాల్సి వుంటుందని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జీఓ కూడా జారీచేసింది. ఒక్క విద్యాశాఖలోనే ఉపాధ్యాయులు మొత్తం 13 రకాల యాప్ లలో డేటా ప్రతినిత్యం అప్లోడ్ చేయాల్సి వుంటుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠ్యాంశాలు చెప్పే సమయం కంటే ప్రభుత్వం ఇచ్చిన యాప్స్ లలో డేటాను నమోదు చేయడానికే అత్యధిక సమయం పడుతోంది. అందులోనూ ఇన్ని రకాల యాప్ లు ఇచ్చిన ప్రభుత్వం ఎవరికీ సెల్ ఫోన్లు మాత్రం ఇవ్వలేదు.
దీనితో ఉపాధ్యాయుల సొంత సెల్ ఫోన్లు కొనుగోలుచేసి ఒక ఫోన్ ను పాఠశాల యాప్ ల కోసం, మరో ఫోను వారి సొంత కార్యకలాపాలకోసం వినియోగించాల్సి వస్తున్నది. ప్రతినిత్యం చాలా అంశాలకు చెందిన ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేయాల్సి రావడంతో ఫోన్ మెమొరీలు సైతం నిండిపోయి సొంత అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడి ఒక్కొక్క ఉపాధ్యాయుడూ రెండు ఫోన్లు కొనాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇపుడు ప్రభుత్వం ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లోనే డేటాను అప్లోడ్ చేయాలని చెప్పడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు..!
ప్రభుత్వ శాఖల సిబ్బంది, అధికారులు ఖచ్చితంగా ప్రభుత్వ యాప్ లను ఖచ్చితంగా వినియోగించాలి. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లోనే బయో మెట్రిక్ వేయాల్సి వుంటుంది. అలా కాకుండా నచ్చినట్టు చేయాలని చూస్తే ఇంటికి వెళ్లిపోవడానికి సిద్దపడాలి. మొన్నటి వరకూ పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది వారికి నచ్చినట్టుగా విధులు నిర్వహించేవారు ఇపుడు అక్కడ కూడా విధులకు ఎన్నిగంటలకు వస్తున్నారు..? ఎన్నిగంటలకు విధులు ముగించుకొని వెళుతున్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు ఆన్ లైన్ అటెండెన్సును ప్రభుత్వం ఖచ్చితంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే మండల కార్యాలయాల్లో కూడా ఆన్ లైన్ అటెండెన్సు యాప్ లను అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం.
అమలు చేసిన శాఖల వివరాలను రాష్ట్ర కార్యాలయంలోని డేష్ బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పరిపాలనలో మార్పులు, చేర్పులు తీసుకొచ్చి ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖలను అందుబాటులో ఉంచేలా చేయడంలో వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. అయితే సర్కార్ వైపు నుంచి ఇక్కడి వరకు బాగానే వుంది. కానీ, సరైన వసతులు లేకుండా ఎక్విప్మెంట్స్ లేకుండా డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేయడం అంత మంచిది కాదు అనేది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపిస్తున్న మాటలు.
ఇకపోతే టీచర్లయితే, తాము పిల్లలకు పాఠాలు చెప్పాలా ? అటెండెన్స్ పడలేదని, సిగ్నల్ ప్రాబ్లం ఉందని, ఎప్పుడు టవర్ సిగ్నల్ వస్తుందా ? ఎప్పుడు అటెండెన్స్ వేసుకుందామా అనేది చూడాలా ? అని బహుటంగానే ఏపీ సర్కార్ ప్రశ్నిస్తున్నారు. అటెండెన్స్ కోసం ప్రభుత్వమే సరైన డివైస్లు ఇవ్వాలని, ఇందుకోసం తగిన వ్యవస్థను తయారు చేశాకే, డిజిటల్ వైపు అడుగులు వేయాలని పలు సూచనలు చేస్తున్నారు. సరైన వసతులు లేకుండా హైటెక్కు హంగులకుపోతే కొత్త వచ్చేది రాకపోను ఉన్నది కూడా పోతుందని చెప్పుకొస్తున్నారు. కొండనాలుకుకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందనే చందంగా తయారవుతుందని తస్మాత్ జాగ్రత్తలు ఇప్పటికే పలువురు ఉద్యోగ సంఘాల నేతలు సున్నితంగా హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయితే, డిజిటలైజేషన్పై మాత్రం పట్టు వదలని ఏపీ సర్కార్ మాత్రం ఎవ్వరి సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదు. మార్పుని ఆహ్వానించాల్సిందేనని ఖరాఖండిగా చెబుతోంది. లోటుపాట్లు ఏమైనా ఉంటే సరిచేసుకుంటూ పోదామని, ఎట్టి పరిస్థితుల్లో పాత పద్దతుల్లో వెళ్లే ఆలోచనే లేదని తేల్చేసింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ డిజిటలైజేషన్ విషయంలో పట్టు విడవని సర్కార్, పట్టు బిగిస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. చినికి చినికి గాలివానలా మారుతుందా ? ఉద్యోగులే అర్థం చేసుకుని డిజిటలైజేషన్ బాటను సుగమనం చేసుకుంటారా ? అనేది కోటి డాలర్ల ప్రశ్నగా మారింది. ఏదేమైనా మార్పు మంచిదే ఓ సారి రుచి చూస్తే పోలే.
వ్యాసకర్త- వాకిటి వెంకటేశం, సీనియర్ జర్నలిస్ట్