- సైబర్ అవేర్నెస్ రన్
- = ప్రజలను చైతన్య పరిచేందుకు పోలీసుల ప్రయత్నం
= 13న అంబేద్కర్ సెంటర్ నుంచి 5 కె రన్
= యువత పెద్దఎత్తున పాల్గొనాలని పోలీస్ అధికారుల పిలుపు
వార్తాలోకం ప్రతినిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా, నవంబర్ 7:
సైబర్ నేరస్థుల వలలో చిక్కుకుని బలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు నడుం బిగించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్న యువతరాన్ని, ప్రజలను జాగృతపరిచేందుకు వర్ధన్నపేట సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ 5కె రన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు, యువత్ ఈ రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వర్ధన్నపేట సర్కిల్ పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఆదివారం ఉదయం 6 గంటలకు అంబేద్కర్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ల రన్ నిర్వహించనున్నారు. సైబర్ అవేర్నెస్ రన్లో పాల్గొని.. సైబర్ నేరగాళ్ల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలని వర్ధన్నపేట, రాయపర్తి జాఫర్గడ్ మండలాల ప్రజలకు యువతకు వర్ధన్నపేట సీఐ, ఎస్ఐ, రాయపర్తి ఎస్ఐ, జాఫర్గడ్ ఎస్ఐ కోరారు. ఈ 5 కిలోమీటర్ల రన్లో పాల్గొని సైకిళ్లను బహుమతులుగా పొందవచ్చని పోలీసులు పేర్కొన్నారు. సైబర్ నేరస్థుల వలలో చిక్కుకుని ఆర్థికంగా, మానసికంగా ఎవరూ నష్టపోకూడదని పోలీసు అధికారులు సూచించారు.