కార్తికేయ మొండి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..!

0
463

‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో కార్తికేయ. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా కూడా ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే అప్పటి నుంచి వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘గుణ 369’, ‘హిప్పీ’,’ 90 ml’ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు కార్తికేయ. ఇలాంటి సమయంలో ఆయనకు గీతా ఆర్ట్స్ నుంచి ‘చావు కబురు చల్లగా’ సినిమా వచ్చింది. ఈ సినిమా తాజాగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో విషయం కంటే చావుపుట్టుకల వేదాంతం ఎక్కువైపోయింది అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే చాలా మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు కార్తికేయ. హీరోగా అవకాశాలు వస్తున్నప్పుడు విలన్‌గా నటించడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. కానీ కార్తికేయ మాత్రం కేవలం హీరోగానే కాకుండా ప్రతినాయక పాత్రలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కరుడుగట్టిన విలన్‌గా మెప్పించాడు. సినిమా ఫ్లాప్ అయినా కార్తికేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ క్రమంలోనే అజిత్ హీరోగా వస్తున్న ‘వాలిమై’ సినిమాలో కూడా కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ కుర్ర నటుడు. ఇందులో ఆయన విలన్‌గా నటించడానికి కారణం హీరో అజిత్ కావడం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా.. అందుకే కథ చెప్పగానే ప్రతినాయకుడిగా నటించడానికి ఒప్పుకున్నా అంటున్నాడు కార్తికేయ. కార్తీతో ఖాకీ లాంటి సినిమా చేసిన వినోద్ ఈ సినిమాకు దర్శకుడు. ఏదేమైనా హీరోగా నటిస్తున్నప్పుడు విలన్‌గా చేయడానికి చాలా ధైర్యం కావాలి.. అది చేస్తున్నాడు కార్తికేయ.